
ఖమ్మం జిల్లా జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్18 తెలుగు కరస్పాండెంట్సత్తుపల్లి పట్టణంలోని ద్వారకాపురిలో ఉండే డేవిడ్రాజు, రాణిల కుమార్తె ప్రత్యూష.. ఇంకా టేనేజీ వయసు దాటలేదు. ఆడుతు పాడుతు తిరిగే వయస్సు. కరోనా కారణంగా కాలేజి లేకపోవడంతో దగ్గరలోని అమ్మమ్మ వాళ్ల ఊరు తుంబూరు వెళ్లింది. ఆ ఇంటికి సమీపంలో ఉండే జగదీష్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. సహజంగానే ఆకర్షణకు గురైంది. సెల్ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు. తరచుగా మాట్లాడుకున్నారు.దీంతో అంతకుమునుపు లేనన్ని సార్లు ప్రత్యూష తన అమ్మమ్మ ఊరికి వెళుతూ ఉంది. క్రమేణా పరిచయం.. స్నేహం..ప్రేమగా మారింది. నిత్యం ఫోన్లు.. ఛాటింగ్లు.. నిద్ర లేచిన దగ్గరి నుంచి మళ్లీనిద్రపోయేదాకా.. నిత్యం ఆన్లైన్లోనే గడిపేవారు.
ఇలా కాలం గడుస్తునే ఉంది. కలసినప్పుడల్లా తమ స్నేహం.. ప్రేమ.. పెళ్లిగా మార్చుకుందామని చెప్పుకున్నారు. సహజంగానే ఆ అమ్మాయి ప్రత్యూష ఆశలు పెంచుకుంది. సిరిసిల్లలో చదువుతున్న ప్రత్యూషకు కాలేజి లేకపోవడంతో హైదరాబాద్లో ఓ ప్రవేటు జాబ్ చూసుకుంది. హైదరాబాద్లోనే ఉంటూ.. అతనికి ఫోన్ చేసి ఎనిమిది నెలలుగా ప్రేమించుకుంటున్నాం.. ఇంకెన్నాళ్లు.. వెంటనే పెళ్లి చేసుకుందామని కోరింది. అతను నిరాకరించాడు. బతిమాలింది. వినలేదు. ఎంతకీ అతను మెత్త బడకపోవడంతో ఆమె తీవ్ర నిరాశకు గురైంది. శానిటైజర్ తాగి ఆత్మహత్యయత్నం చేసింది. స్నేహితులు ఆసుపత్రిలో చేర్చారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందింది.
దీనికంతటికీ జగదీష్ కారణమంటూ ప్రత్యూష బంధువులు ఆమె మృతదేహాన్ని అతని ఇంటి ముందు పెట్టి ఆందోళనకు దిగారు. అతను, అతని తల్లిదండ్రులు పరారయ్యారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.