ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ఐతే హత్య జరిగి రెండేళ్లు కావొస్తున్నా ఇంతవరకూ నిందితులు ఎవరు అనేది తేలలేదు. మరోవైపు ఏడాదిగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం మరో విడత సీబీఐ అధికారులు కడప జిల్లాలో విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్య కేసు దర్యాప్తుపై సీబీఐకి లేఖ రాశారు. ఇందులో పలు కీలక అంశాలను ఏబీ వెంకటేశ్వరరావు ప్రస్తావించారు. వివేకా హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తులే అచేతనత్వం నెలకొందని ఆయన అన్నారు. వివేకా హత్య జరిగిన సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడచినా పురోగతి లేదన్నారు. ఈ కేసుకు సంబంధించి తన దగ్గర సమాచారముందని సీబీఐకి రెండుసార్లు లేఖరాసినట్లు వెల్లడించారు. అలాగే దర్యాప్తు అధికారి ఏన్.ఎం సింగ్ కు ఫోన్ చేసినా స్పందన కరువైందన్నారు.
హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు కొందరు యత్నించారన్నారు. వివేకా హత్య తర్వాత ఇల్లంతా కడిగేశారని.. అలాగే మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించేదాకా ఘటనాస్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి ఆయన బంధువులు తమ అధీనంలో ఉంచుకున్నారని ఆరోపించారు. ఆ సమయంలో మీడియాను, ఇంటెలిజెన్స్ సిబ్బందిని అనుమతించలేదని.. మొత్తం సమాచారాన్ని నిఘా విభాగం అప్పటి దర్యాప్తు బృందానికి అందజేశారన్నారు.
ఈ మేరకు తాను ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు సాగించాలని కోరుతూ హైదరాబాద్ లోని సీబీఐ జాయింట్ డైరెక్టర్ కు ఏబీ వెంకటేశ్వరరావు లేఖ రాశారు. ఇప్పుడు ఏబీ రాసిన లేఖ సంచలనంగా మారింది. వివేకా హత్య జరిగిన వెంటనే ఓ హెడ్ కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్ హోం గార్డు అక్కడి చేరుకున్నా లోనికి రానివ్వలేదని.. ఇందులో చాలా అనుమానాలున్నాయన్నట్లు ఆయన లేఖ రాశారు. దీనిపై దర్యాప్తు జరిపి వీలైనంత త్వరగా కేసును తేల్చాలని కోరారు.
ఐతే ఈ కేసుపై ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్న ఏబీ వెంకటేశ్వర్లు ఇప్పుడు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. ప్రస్తుత ప్రభుత్వం నుంచి తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏబీ వెంకటేశ్వర్లు.. ఈ విషయంపై కోర్టులో పోరాడుతున్నారు. ఇదే సమయంలో సీఎం వైఎస్ జగన్ బాబాయి హత్య కేసుపై ఏకంగా సీబీఐకి లేఖ రాయడం, అందులే కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. మరి సీబీఐ అధికారులు ఏబీ లేఖను, ఆయన ఇచ్చామన్న సమాచారాన్ని పరిగణలోకి తీసుకుంటారా..? లేదా..? అనేది సస్పెన్స్ గా మారింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.