తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నికకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ జగనుంది. చిత్తూరు జిల్లాలో మూడు, నెల్లూరు జిల్లాల్లో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేశారు. మొత్తం 2,470 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 17,10,699 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రంలో కొవిడ్ వేగంగా వ్యాపిస్తున్నందున పోలింగ్ కేంద్రాల వద్ద కొవిడ్ మార్గదర్శకాలను పాటించేలా ఏర్పాట్లుచేశారు. మాస్క్ లేని వారికి ప్రవేశాన్ని నిషేధించారు. శానిటైజర్లు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఓటు వేసేందుకు వచ్చేవారు సామాజిక దూరం పాటించేలా సూచికలను ఏర్పాటు చేశారు. అలాగే కోవిడ్ పై అవగాహన కల్పించేలా ఫ్లెక్సీలు, బోర్డులు కూడా ఉంచారు. ఓటర్లు గుమిగూడకుండా, గంటల తరబడి క్యూలో నిల్చొనే సమస్య రాకుండా ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
మరోవైపు తిరుపతి ఉపఎన్నిక బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులున్నారు. వీరిలో వైఎస్ఆర్సీ నుంచి డాక్టర్ గురుమూర్తి, టీడీపీ నుంచి కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి, బీజేపీ నుంచి రిటైర్డ్ ఐఏఎస్ రత్నప్రభ, కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ పోటీలో ఉన్నారు. ఎవరికి వారు గెలుపుపై ధీమాతో ఉన్నారు. చిత్తూరు జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ హరినారాయణ తెలిపారు. తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలలో 1056 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మూడు నియోజకవర్గాలకు సంబందించి 7,40,607 మంది ఓటర్లు కలరనితెలిపారు. ఎన్నికల నిర్వహణకు గాను 5054 మంది పోలింగ్ సిబ్బందిని నియామకం చేసినట్లు ఇందులో పి.ఓ లు 1266 మంది ఏ.పి.ఓ లు 1266 మంది ఓ.పి.ఓ లు 2522 మంది, మైక్రో అబ్జర్వర్లు 451 మంది, సెక్టోరల్ ఆఫీసర్లు 111 మంది, రూట్ ఆఫీసర్లు 111 మంది కలరని తెలిపారు. 377 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించగా అందులో తిరుపతి నియోజకవర్గానికి సంబంధించి 83, శ్రీకాళహస్తి కి సంబంధించి 136, సత్యవేడుకు సంబంధించి 158 కలవని తెలిపారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు 2,913 మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఇందులో 10 మంది అదనపు ఎస్.పి లు, 27 మంది డి.ఎస్.పి లు, 66 మంది సి.ఐ లు 169 మంది ఎస్.ఐ లు,697 మంది ఏ.ఎస్.ఐ లు, హెడ్ కానిస్టేబుళ్లు, 1,519 మంది పి.సీ లు 234 మంది ఎస్.టి.ఎఫ్ సిబ్బంది 191 మంది హోమ్ గార్డ్ లు, 716 మ ది సి.ఐ.ఎస్.ఎఫ్ అధికారులు, 105 మంది రూట్ మొబైల్స్, 27 క్వూ ఆర్ టీమ్స్, 13 సైక్లింగ్ ఫోర్స్, 8 ఎస్.ఎస్.టి టీమ్స్, 8 ఫ్లయింగ్ స్క్వాడ్, 8 ఎం.సి.సి బృందాలు, 19 ఇంటర్వెన్షన్, మహిళా ఇంటర్వెన్షన్ టీమ్స్ ఏర్పాటు చేసినట్లు వివరించారు.