ఒక వైపు మండుటెండలు మరో వైపు కరోనా మహమ్మారి తో ప్రజలు ఇళ్లకే పరిమితమైన వేళ తాగునీటి కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిప్రాంతాల్లో ప్రజలకు సరిపడా నీరు లేకపోవడంతో కలుషితనీరు సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి తాను పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలని భావించాడు. అనుకుందే తడవుగా గ్రామ ప్రజల గొంతు తడపాలనే ఓ మహత్తరమైన ఆలోచన తట్టింది. మండు వేసవిలో ఎంతో ఇబ్బందులకు గురి అవుతున్న వేళ తమ గ్రామ ప్రజల కోసం ప్రతి రోజూ ఉచితంగా శుద్ధజలాన్ని అందిస్తున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లా దొండపాడు గ్రామానికి కచెందిన జవ్వాజి సాంబయ్య... వేసవి కాలంలో స్థానికుల దాహార్తి తీరుస్తున్నాడు. ఏదో చలివేంద్రం ఏర్పాటు చేశాడనుకుంటే మీ పొరబాటే. ఆర్వో వాటర్ పేరుతో ప్రజల్ని దోచుకుంటున్న ఈ రోజుల్లో.. సొంతగా ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేయడమే కాకుండా.. స్థానికులకు ఉచితంగా మంచినీళ్లు సరఫరా చేస్తున్నాడు.
జొన్నలగడ్డలోని ప్రధాన రహదారి అయిన గుంటూరు-కర్నూల్ రోడ్డుపై వెళ్లే లారీలు బస్సులు మరియు ఇథర వాహనదారులకు కూడా ఉచితంగా శుద్ధ జలాన్ని అందిస్తున్నాడు. అంతే కాకుండా దొండపాడుతో పాటు జొన్నలగడ్డ గ్రామాల్లో ఇంటింటికీ ఉచితంగా నీరిస్తున్నాడు. ఈ రెండు గ్రామాల్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో శుభ కార్యాలు జరుపుకునే వారు ఇక్కడికి వచ్చి ఉచితంగా మంచినీటిని తీసుకెళ్తుంటారు. ఇలా ఎంతోమందికి రూపాయి ఖర్చులేకుండా అందరికి శుద్ధజలాన్ని అందిస్తున్నాడు సాంబయ్య. ఆర్ ఓ ప్లాంట్లో నీటిని వ్యాపారస్తులు పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు అమ్ముతుంటే సాంబయ్య మాత్రం ఉచితంగా శుద్ధ జలాన్ని అందిస్తున్నాడు. ఆర్ఓ ప్లాంట్ నిర్వహణకు అయ్యే విద్యుత్ చార్జీలు మరియు మోటర్లు, మంచినీటి ఫిల్టర్ల నిర్వహణ అంతా తన సొంత ఖర్చులతోనే నిర్వహిస్తున్నాడు సాంబయ్య.
ఈ సమాజం మనకు ఎంతో ఇచ్చింది మనం కూడా సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలని చెప్పే ముందు నేనే ముండదుగు వేసి మా అత్తమామల జ్ఞాపకార్ధం నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి దొండపాడు గ్రామస్థుల మంచినీటిని అందిస్తున్నని సాంబయ్య తెలిపారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే ఎంతోమంది దాహార్తి తీర్చడం ఆనందంగా ఉందని చెబుతున్నారు. ప్రతి ఒక్కరు తమ సంపాదనలో ఎంతోకొత సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని జవ్వాజి సాంబయ్య పిలుపునిచ్చారు. పిల్లనిచ్చిన అత్తమామలపై సాంబయ్యకు ఉన్న ప్రేమ, సమాజానికి ఏమైనా చేయాలనే తపన వెరసి.. పలు గ్రామాల దాహార్తిని తీరుస్తోంది.