
- News18 Telugu
- Last Updated: April 17, 2021, 07:26 IST
దేశంలో కరోనా కేసులు విపపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ముందు జాగ్రత్త చర్యగా ఇప్పటికే పలు పరీక్షలను ఆయా ప్రభుత్వాలు రద్దు చేశాయి. మరొ కొన్ని ఎగ్జామ్స్ ను వాయిదా వేశాయి. కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ టెన్త్ పరీక్షలను ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. నీట్ పీజీ 2021 పరీక్షను సైతం కేంద్రం వాయిదా వేసింది. తెలంగాణలోనూ ఈ సారి టెన్త్ ఎగ్జామ్స్ ను సర్కార్ రద్దు చేసింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఎలాంటి పరీక్షలు లేకుండానే ప్రమోట్ చేస్తున్నట్లు ప్రకటించింది. సెకండ్ ఇయర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. జూన్ మొదటి వారంలో అధికారులు సమీక్షించి పరీక్షను తిరిగి ఎప్పుడు నిర్వహించాలన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత వరకు వివిధ బోర్డ్ ఎగ్జామ్స్ ను నిర్వహించాలా? వద్దా? అన్న అంశంపై ఆ ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరో వైపు ఆ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి.
అనేక విద్యా సంస్థల్లో విద్యార్థులు కరోనా బారిన పడుతున్నారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ విషయమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం స్పందించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులను సర్కార్ నిశితంగా గమనిస్తోందన్నారు. విద్యార్థుల భవిష్యత్, భద్రత విషయంలో సీఎం జగన్ సూచనల మేరకు విద్యాశాఖ చర్యలు తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే పరీక్షల గురించి కూడా ఆయన స్పందించారు. పరీక్షల విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి చెప్పారు. రానున్న రోజుల్లో ఏర్పడే పరిస్థితులకు అనుగుణంగా పరీక్షల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విద్యార్థులకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బందులు రానివ్వమని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆంక్షలు కఠినతరం చేస్తున్నా.. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 35,962 శాంపిల్స్ ని పరీక్షించగా 6,096 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా వారీగా కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లాలో 313, చిత్తూరు జిల్లాలో 1,024, తూర్పుగోదావరి జిల్లాలో 750, గుంటూరు జిల్లాలో 735, కడప జిల్లాలో 243, కృష్ణాజిల్లాలో 246, కర్నూలు జిల్లాలో550, నెల్లూరు జిల్లాలో 354, ప్రకాశం జిల్లాలో 491, శ్రీకాకుళం జిల్లాలో 534, విశాఖపట్నం జిల్లాలో 489, విజయనగరం జిల్లాలో 299 పశ్చిమగోదావరి జిల్లాలో 68 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.