
- News18 Telugu
- Last Updated: April 15, 2021, 12:32 IST
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుదేశం పార్టీల మధ్య రాజకీయ వైరం తారాస్థాయికి చేరింది. తిరుపతి ఉపఎన్నిక సందర్భంగా రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అనే విధంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన విమర్శలు వివాదాస్పదమయ్యాయి. తిరుపతి ఉపఎన్నిక ప్రచారం సందర్బంగా ఈనెల 7న తిరుపతిలో నిర్వహించిన మీడియా మసావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మార్ఫింగ్ వీడియోని ప్లే చేశారంటూ ఆయనపై వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కు చెందిన నాయకులు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు దేవినేని ఉమాకు నోటీసులు జారీ చేసింది. కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం, గొల్లపూడిలోని దేవినేని ఉమా నివాసానికి వెళ్లిన అధికారులు ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. కర్నూలులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరుకావాలని సీఐడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఐతే నోటీసుల్లో పేర్కొన్న కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. గురువారం ఉదయం 10.20 గంటలకు గొల్లపూడిలోని నివాసంలో నోటీసులు అధికారులు..ఉదయం 10.30 గంటలకు కర్నూలు రావాలని నోటీసుల్లో పేర్కొనడం చర్చనీయాంశమైంది. ప్రెస్మీట్లో మార్ఫింగ్ చేసిన జగన్ వీడియోలు ప్రదర్శించారని ఉమాపై అభియోగాలు నమోదు చేశారు. ఈమేరకు దేవినేని ఉమాపై సెక్షన్ 464, 465, 468, 469, 470, 471, 505, 120(బి) కింద కేసు నమోదు చేశారు. అలాగే మీడియా సమావేశంలో ప్రదర్శించిన వీడీయోలను కూడా విచారణ కు తీసుకురావాలని పేర్కొన్నారు.
మాజీ మంత్రి దేవినేని ఉమాకు సీఐడీ నోటీసులు
ఇది చదవండి : ఏపీలో కరోనాపై ప్రభుత్వం కీలక నిర్ణయం... ఆరు జిల్లాల్లో హై అలర్ట్..
కాగా ఈ నెల 7న తిరుపతిలో ఓ ప్రెస్ మీట్ నిర్వహించిన దేవినేని ఉమామహేశ్వరరావు.. ఓ సీఎం జగన్ కు సంబంధించిన ఓ వీడియోను ప్లే చేశారు. అదే వీడియోను ట్వీట్ చేశారు కూడా. అందులో ఏముందంటే.. ‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అని ఉంది. దీనిపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ చెక్ టీమ్ దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించింది. గత ఆరేళ్ల కాలంలో సీఎం జగన్ వివిధ సందర్భంగాల్లో మాట్లాడిన వీడియోలను కట్ చేసి వాటిని మార్ఫింగ్ చేసి ప్లే చేసినట్లు నిర్ధారించారు. ఉమా ప్లే చేసిన వీడియోలు 2014 ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలో, 2019లో ఢిల్లీ పర్యటన సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసినట్లు నిర్ధారించారు.