- News18 Telugu
- Last Updated: July 02, 2020, 14:45 IST
ఏపీలో ఆర్బీకే (రైతు భరోసా కేంద్రాలు)లను ప్రారంభించిన ప్రభుత్వం..ఖరీఫ్ సాగుపై దృష్టి సారించింది. ఆర్బీకే పరిధిలో ఏ పంటలు వేయాలన్న దానిపై మ్యాపింగ్ చేయాలని అధికారులకు సూచించారు. మార్కెటింగ్ చేయలేని పంటలు వేస్తే.. రైతులు నష్టపోతారని అభిప్రాయపడ్డారు. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. పంటల ప్రణాళిక, ఇ–మార్కెటింగ్ ఫ్లాట్ఫాంపై క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. ఇ– క్రాపింగ్ మీద గైడ్లైన్స్, ఎస్ఓపీలను వెంటనే తయారుచేయాలని.. ఇ– క్రాపింగ్ విధివిధానాలను గ్రామ సచివాలయాల్లో, ఆర్బేకే కేంద్రాల్లో పెట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇక రైతుల నుంచి 30శాతం పంటలను ప్రభుత్వమే కొనుగోలుచేయాలని నిశ్చయించామని సీఎం జగన్న అన్నారు. మిగతా 70శాతం పంటకూడా అమ్ముడయ్యేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని అధికారులకు సూచించారు. దీనికోసం ఇ–మార్కెటింగ్ ప్లాట్ఫాంను ఏర్పాటు చేయాలని.. గ్రామస్థాయిలో గ్రేడింగ్, ప్యాకింగ్ సదుపాయాలు ఉండాలని చెప్పారు.
కాగా, తెలంగాణలో ఈ వానకాలం నుంచే నియంత్రిత సాగు విధానాన్ని అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. అందరూ ఒకే రకమైన పంటలు వేయకుండా.. డిమాండ్ ఉన్న పంటలనే వేయాలని సీఎం కేసీఆర్ రైతులకు చెప్పారు. వానాకాలంలో మొక్కజొన్న పంటలను వేయవద్దని..దాని స్థానంలో పత్తి, కందులు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని సూచించారు. యాసంగిలో మొక్కజొన్న వేయవచ్చని తెలిపారు. ఏ ఏ ప్రాంతంలో ఏ పంటలు వేయాలన్న దానిపై రైతులకు పూర్తి వివరాలు అందజేయాలని ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఐతే తెలంగాణ బాటలోనే సీఎం జగన్ కూడా నియంత్రిత సాగుపై దృష్టిపెట్టినట్లు స్పష్టమవుతోంది.